లేఖనములు
2 నీఫై 21


21వ అధ్యాయము

యెష్షయి మొద్దు (క్రీస్తు) నీతి యందు తీర్పుతీర్చును—వెయ్యేళ్ళ పరిపాలనలో దేవుని గూర్చిన జ్ఞానముతో లోకము నిండియుండును—యెహోవా ఒక ధ్వజమునెత్తి ఇశ్రాయేలును సమకూర్చును—యెషయా 11 తో పోల్చుము. సుమారు క్రీ. పూ. 559–545 సం.

1 యెష్షయి మొద్దు నుండి చిగురు పుట్టును, వాని వేరుల నుండి అంకురము ఎదుగును.

2 ప్రభువు యొక్క ఆత్మ, జ్ఞాన వివేకములకు ఆధారమగు ఆత్మ, ఆలోచన బలములకు ఆధారమగు ఆత్మ, తెలివిని ప్రభువు యెడల భయభక్తులను పుట్టించు ఆత్మ అతనిమీద నిలుచును;

3 ప్రభువు భయము అతడిని చురుకైన వానిగా చేయును; కంటి చూపును బట్టి అతడు తీర్పు తీర్చడు, తాను విను దానిని బట్టి విమర్శ చేయడు.

4 నీతినిబట్టి బీదలకు తీర్పుతీర్చును, భూనివాసులలో దీనులైన వారికి యథార్థముగా విమర్శ చేయును; తన వాగ్దండము చేత లోకమును కొట్టును, తన పెదవుల ఊపిరి చేత దుష్టులను సంహరించును.

5 అతని నడుమునకు నీతియు, అతని తుంట్లకు విశ్వాస్యతయు నడికట్టుగా ఉండును.

6 తోడేలు గొఱ్ఱెపిల్లతో వాసము చేయును, చిరుతపులి మేకపిల్లతో పండుకొనును, దూడయు కొదమ సింహమును పెంచబడిన కోడెయు కూడుకొనగా బాలుడు వాటిని తోలును.

7 ఆవులు, ఎలుగులు కూడి మేయును; వాటి పిల్లలు ఒక్కచోటనే పండుకొనును; ఎద్దు మేయునట్లు సింహము గడ్డి మేయును.

8 పాలుకుడుచు పిల్ల నాగుపాము పుట్ట యొద్ద ఆటలాడును, మిడినాగు పుట్ట మీద పాలువిడిచిన పిల్ల తన చేయి చాచును.

9 నా పరిశుద్ధ పర్వతమందంతటను ఏ మృగము హాని చేయదు, నాశనము చేయదు, సముద్రము జలముతో నిండియున్నట్లు లోకము ప్రభువును గూర్చిన జ్ఞానముతో నిండియుండును.

10 ఆ దినమున ప్రజలకు ధ్వజముగా నిలుచుచుండు యెష్షయి వేరు చిగురునొద్ద జనములు విచారణ చేయును; ఆయన విశ్రమస్థలము ప్రభావము గలదగును.

11 ఆ దినమున శేషించు తన ప్రజల శేషమును అష్షూరులోనుండియు ఐగుప్తులోనుండియు పత్రోసులోనుండియు కూషులోనుండియు ఏలాములోనుండియు షీనారులోనుండియు హమాతులోనుండియు సముద్ర ద్వీపములలో నుండియు విడిపించి రప్పించుటకు ప్రభువు రెండవమారు తన చేయి చాచును.

12 జనములను పిలుచుటకు ఆయన యొక ధ్వజము నిలువబెట్టును, భ్రష్టులైపోయిన ఇశ్రాయేలీయులను పోగుచేయును, భూమి యొక్క నాలుగు దిగంతముల నుండి చెదిరిపోయిన యూదా వారిని సమకూర్చును.

13 ఎఫ్రాయిమునకున్న మత్సరము పోవును, యూదా విరోధులు నిర్మూలమగుదురు; ఎఫ్రాయిము యూదా యందు మత్సరపడడు, యూదా ఎఫ్రాయిమును బాధించడు.

14 వారు ఫిలిష్తీయుల భుజముల మీద ఎక్కుదురు, పడమటి వైపుకు పరుగెత్తిపోవుదురు; ఏకీభవించి తూర్పు వారిని దోచుకొందురు; ఎదోమును మోయాబును ఆక్రమించుకొందురు; అమ్మోనీయులు వారికి లోబడుదురు.

15 మరియు ప్రభువు ఐగుప్తు సముద్రము యొక్క జిహ్వాకారపు భాగమును నిర్మూలము చేయును; తన బలమైన గాలులతో నదిని బాధించును, ఏడు కాలువలుగా దానిని చీలగొట్టును, పాదరక్షలు తడువకుండా మనుష్యులు దాటునట్లు దానిని చేయును.

16 కావున ఐగుప్తు దేశమునుండి ఇశ్రాయేలు వచ్చిన దినమున వారికి దారి కలిగినట్లు అష్షూరు నుండి వచ్చు ఆయన ప్రజల శేషమునకు రాజమార్గముండును.