యేసు క్రీస్తు మనకెంతో విలువైనవారు
యేసు క్రీస్తుపై దృష్టిసారించండి ఆయన మన రక్షకుడు మరియు విమోచకుడు, మనం చూడవలసిన “గురి”, మన అతిగొప్ప నిధి.
1907లో, జార్జ్ హెర్బర్ట్ అనే సంపన్న ఆంగ్లేయుడు, కార్నార్వోన్ యొక్క ఐదవ ఎర్ల్,1 ఈజిప్టుకు వెళ్ళి పురావస్తు శాస్త్రంలో ఆసక్తిని పెంచుకున్నాడు. అతను సుప్రసిద్ధ ఈజిప్టు శాస్త్రవేత్త హోవార్డ్ కార్టర్ని సంప్రదించి భాగస్వామ్యాన్ని ప్రతిపాదించాడు. కార్టర్ వారి పురావస్తు త్రవ్వకాలను పర్యవేక్షిస్తాడు మరియు కార్నార్వోన్ నిధులను అందజేస్తాడు.
వారు కలిసి, వివిధ ప్రదేశాలను విజయవంతంగా అన్వేషించారు. ఆ తర్వాత, అనేకమంది ఫరోల సమాధులు కనుగొనబడిన ఆధునిక లక్సోర్కు సమీపంలో ఉన్న కింగ్స్ లోయలో త్రవ్వకాలు చేయడానికి వారు అనుమతి పొందారు. వారు టుటన్ఖామున్ రాజు సమాధి కోసం వెదకాలని నిర్ణయించుకున్నారు. టుటన్ఖామున్ 3000 సంవత్సరాల క్రితం ఈజిప్ట్ సింహాసనాన్ని అధిరోహించాడు మరియు అతని ఊహించని మరణానికి ముందు పదేళ్ళపాటు పాలించాడు.2 అతను కింగ్స్ లోయలో ఖననం చేయబడినట్లు తెలిసింది,3 కానీ అతని సమాధి ఉన్న ప్రదేశం తెలియదు.
కార్టర్ మరియు కార్నార్వోన్ టుటన్ఖామున్ సమాధి కోసం వెదకుతూ ఐదు సంవత్సరాలు విఫలయత్నం చేసారు. చివరికి కార్నర్వాన్ ఇకపై తాను పరిశోధన కొనసాగించనని కార్టర్కి తెలియజేశాడు. కార్టర్ మరికొంతకాలం త్రవ్వకాలు జరుపమని అభ్యర్థించాడు మరియు కార్నార్వోన్ దయతలచి, త్రవ్వకాలకు నిధులు చెల్లించడానికి అంగీకరించాడు.
వారి స్వంత బేస్ క్యాంపు ప్రాంతం తప్ప—కింగ్స్ లోయ యొక్క అంతస్తు మొత్తం పద్ధతి ప్రకారం త్రవ్వబడిందని కార్టర్ గ్రహించాడు. అక్కడ త్రవ్విన కొద్ది రోజుల్లోనే, సమాధికి వెళ్ళే మొదటి మెట్లను వారు కనుగొన్నారు.4
కార్టర్ టుటన్ఖామున్ సమాధి ముందు గదిలోకి తొంగిచూసినప్పుడు, ప్రతిచోటా అతనికి బంగారం కనిపించింది. దాదాపు మూడు నెలలు ముందు గదిలోని విషయాలను జాబితా చేసిన తర్వాత, 100 సంవత్సరాల క్రితం—1923, ఫిబ్రవరిలో వారు మూసివున్న సమాధి గదిని తెరిచారు. ఇది ఇరవయ్యో శతాబ్దపు అత్యంత ప్రసిద్ధ పురావస్తు ఆవిష్కరణ.
ఆ సంవత్సరాల్లో నిష్ఫలమైన పరిశోధన సమయంలో, కార్టర్ మరియు కార్నార్వోన్ వారు నిలబడిన ప్రదేశం క్రింద ఉన్న వాటిని పట్టించుకోలేదు. రక్షకుడు పుట్టడానికి దాదాపు ఐదు శతాబ్దాలకు ముందు, మోర్మన్ గ్రంథ ప్రవక్తయైన జేకబ్ దగ్గరలో ఉన్నవాటిని తక్కువ అంచనా వేయడాన్ని లేదా తేలికగా తీసుకోవడాన్ని “గురిని దాటి చూచుట” అని సూచించాడు. వాగ్దానం చేయబడిన మెస్సీయ వచ్చినప్పుడు యెరూషలేము ప్రజలు ఆయనను గుర్తించరని జేకబ్ ముందుగానే చూసాడు. “వారు సరళమైన మాటలను తృణీకరించి … వారు గ్రహించలేని సంగతుల కొరకు [వెదకుతారు] అని జేకబ్ ప్రవచించాడు. కావున, గురిని దాటి చూచుట వలన [వచ్చిన] వారి గ్రుడ్డితనమును బట్టి వారు తప్పక పతనము కావలెను”5 అని జేకబ్ ప్రవచించాడు. మరో మాటలో చెప్పాలంటే, వారు తొట్రుపడతారు.
జేకబ్ ముందుగా చూసినది నిజమైంది. యేసు యొక్క మర్త్య పరిచర్యలో, అనేకమంది గురిని దాటి, ఆయనను దాటి చూసారు. వారు లోక రక్షకుడిని దాటి చూసారు. పరలోక తండ్రి ప్రణాళికను నెరవేర్చడంలో ఆయన పాత్రను గుర్తించడానికి బదులుగా, వారు ఆయనను నిందించారు మరియు శిలువ వేసారు. వారికి రక్షణ మార్గాన్ని అందించడానికి వేరొకరు వస్తారని వారు ఎదురుచూసారు.
యెరూషలేములోని జనుల వలె, కార్టర్ మరియు కార్నర్వాన్ల వలె, మనం కూడా గురిని దాటి చూడడానికి మొగ్గుచూపవచ్చు. ఈ ధోరణికి వ్యతిరేకంగా మనం జాగ్రత్త పడాలి, లేకపోతే మనం మన జీవితాల్లో యేసు క్రీస్తును కోల్పోతాము మరియు ఆయన మనకు అందించే అనేక దీవెనలను గుర్తించడంలో విఫలమవుతాము. మనకు ఆయన కావాలి. “రక్షించుటకు శక్తిమంతుడైన వాని మంచితనముపై పూర్తిగా”6 ఆధారపడాలని మనం ఉపదేశించబడ్డాము.
ఆయనే మన లక్ష్యం. ఆయన అందించే దానికంటే మించినది ఏదైనా అవసరమని మనం తప్పుగా ఊహించినట్లయితే, మన జీవితాల్లో ఆయన కలిగియుండగల పరిధిని, శక్తిని మనం తిరస్కరిస్తాము లేదా తగ్గిస్తాము. ఆయన కనికరపు హక్కులను పొంది, ఆ కనికరమును మనకు విస్తరించారు.7 “[మన] పాప పరిహారము కొరకు [మనం] చూడవలసిన ఏకైక మూలాధారం ఆయనే.”8 తండ్రి యొద్ద ఆయన మన ఉత్తరవాది మరియు ఆయన రాజ్యంలో వారసులుగా తిరిగి ఆయన వద్దకు రావాలని తండ్రి కోరుకున్నదానిని సమర్థిస్తారు. “[మన] కన్నులెత్తి దేవుని కుమారుడు తన జనులను విమోచించుటకు వచ్చునని, ఆయన [మన] పాపముల కొరకు ప్రాయశ్చిత్తము చేయుటకు శ్రమపడి మరణించునని, ఆయన మృతులలో నుండి లేచునని, అది పునరుత్థానమును తెచ్చునని ఆయన యందు నమ్ముట మొదలుపెట్టుడి,”9 అని ఆల్మా చెప్పాడు. యేసు క్రీస్తు మనకెంతో విలువైనవారు.
పశ్చాత్తాపపడేందుకు అనుదిన అవకాశంతో పాటు, ఉద్దేశ్యపూర్వకంగా ఆయనపై దృష్టిపెట్టడానికి రక్షకుడు మనకు అనేక మార్గాలనిచ్చారు. కొన్నిసార్లు ఈ దీవెన యొక్క గొప్పతనాన్ని మనం తక్కువ అంచనా వేస్తాము. నాకు ఎనిమిదేండ్లు ఉన్నప్పుడు, మా నాన్న చేత నేను బాప్తిస్మం పొందాను. తర్వాత, మేము రద్దీగా ఉన్న వీధిని దాటడానికి వెళ్తున్నప్పుడు నేను ఆయన చేయి పట్టుకున్నాను. నేను పట్టించుకోలేదు మరియు కాలిబాట నుండి అడుగు ముందుకు వేసినప్పుడు పెద్ద ట్రక్కు దూసుకొచ్చింది. మా నాన్న నన్ను వీధి నుండి వెంటనే కాలిబాటపైకి వెనక్కి లాగారు. ఆయన అలా చేయకపోయి ఉంటే, ట్రక్కు నన్ను ఢీకొట్టి ఉండేది. నా అల్లరి స్వభావాన్ని బట్టి, “బహుశా నేను ట్రక్కుతో చంపబడడం మంచిదేమో, ఎందుకంటే నా బాప్తిస్మం తర్వాత నేను ఇప్పుడు ఉన్నంత పరిశుద్ధంగా ఎప్పటికీ ఉండలేను” అని అనుకున్నాను.
ఎనిమిదేళ్ళ వయస్సులో, బాప్తిస్మం యొక్క నీరు పాపాలను కడిగివేస్తుందని నేను పొరపాటుగా ఊహించాను. అది నిజం కాదు. నా బాప్తిస్మం జరిగినప్పటి నుండి, మనం బాప్తిస్మపు నిబంధనను చేసి పాటించినప్పుడు ఆయన ప్రాయశ్చిత్త త్యాగము ద్వారా యేసు క్రీస్తు యొక్క శక్తి చేత పాపాలు కడిగివేయబడతాయని నేను నేర్చుకున్నాను.10 అప్పుడు, పశ్చాత్తాపము యొక్క బహుమానం ద్వారా, మనము శుభ్రంగా ఉండగలము. సంస్కారము మన జీవితాల్లోకి శక్తివంతమైన నీతి చక్రాన్ని తీసుకువస్తుందని, మన పాప పరిహారాన్ని నిలుపుకోవడానికి వీలు కల్పిస్తుందని కూడా నేను తెలుసుకున్నాను.11
కార్టర్ మరియు కార్నార్వోన్ పాదాల క్రింద ఉన్న నిధి వలె, మనం సంస్కార సమావేశానికి హాజరైన ప్రతిసారీ సంస్కారం యొక్క అమూల్యమైన దీవెనలు మనకు లభిస్తాయి. విరిగిన హృదయము మరియు నలిగిన ఆత్మతో, బాప్తిస్మపు నిబంధనకు అనుగుణంగా జీవించాలనే దృఢ నిశ్చయంతో, పరివర్తన చెందిన ఒక క్రొత్త వ్యక్తి బాప్తిస్మము మరియు నిర్ధారణకు చేరుకునే విధంగా మనం సంస్కారానికి వచ్చినట్లయితే పరిశుద్ధాత్మ మన నిరంతర సహవాసిగా ఉంటారని మనకు వాగ్దానం చేయబడింది. పవిత్రపరచు తన శక్తితో పరిశుద్ధాత్మ మనల్ని దీవిస్తారు, తద్వారా మనం ఎల్లప్పుడూ మన పాప పరిహారాన్ని నిలుపుకోగలము.12
పశ్చాత్తాపము ద్వారా, సంస్కారము కొరకు మనస్సాక్షిగా సిద్ధపడడం ద్వారా మరియు యోగ్యతతో పాల్గొనడం ద్వారా మన ఆధ్యాత్మిక పునాది బలపరచబడుతుంది. బలమైన ఆధ్యాత్మిక పునాదితో మాత్రమే మన జీవితంలో మనకు ఎదురయ్యే ఉపమానరూపక వానలు, వరదలు, గాలులకు మనం ప్రభావవంతంగా స్పందించగలము.13 దానికి విరుద్ధంగా, మనం స్వచ్ఛందంగా సంస్కార సమావేశానికి హాజరుకానప్పుడు లేదా సంస్కార సమయంలో మనం రక్షకునిపై దృష్టిపెట్టనప్పుడు మన ఆధ్యాత్మిక పునాది బలహీనమవుతుంది. మనం అనుకోకుండా “ప్రభువు యొక్క ఆత్మ నుండి [మనల్ని] దూరము చేసుకుంటాము, [మనం] దీవించబడి, వర్థిల్లి, రక్షింపబడునట్లు [మనల్ని] జ్ఞాన మార్గములలో నడిపించుటకు ఆ ఆత్మకు [మన] యందు స్థానము లేకుండా పోతుంది.”14
పరిశుద్ధాత్మ మనతో ఉన్నప్పుడు, మనం దేవాలయంలో చేసే నిబంధనల వంటి ఇతర నిబంధనలను చేసి, పాటించడానికి ప్రేరేపించబడతాము, నడిపించబడతాము. ఆవిధంగా చేయడం దేవునితో మన సంబంధాన్ని అధికం చేస్తుంది.15 దేవాలయాలను నిరంతరం సభ్యులకు దగ్గరగా తీసుకువస్తూ, అనేక క్రొత్త దేవాలయాలు ఇటీవలి సంవత్సరాలలో ప్రకటించబడడాన్ని మీరు గమనించే ఉంటారు.16 దానికి విరుద్ధంగా, దేవాలయాలు మరింత అందుబాటులోకి వచ్చినప్పుడు, దేవాలయ హాజరును మరింత తేలికగా తీసుకోవడం మనకు సులభం కావచ్చు. దేవాలయాలు దూరంగా ఉన్నప్పుడు, దేవాలయానికి వెళ్ళి అక్కడ ఆరాధించడానికి మన సమయాన్ని, వనరులను మనం ప్రణాళిక చేసుకుంటాం. ఈ ప్రయాణాలకు మనం ప్రాధాన్యతనిస్తాము.
దేవాలయం దగ్గరగా ఉన్నప్పుడు, “సరే, నేను మరొకసారి వెళ్తాను” అని మనలో మనం చెప్పుకుంటూ, చిన్న చిన్న విషయాలను హాజరయ్యే మార్గంలో అడ్డుకోవడం చాలా సులభం. దేవాలయానికి సమీపంలో నివసించడం వల్ల దేవాలయంలో సమయాన్ని ప్రణాళిక చేయడంలో ఎక్కువ సౌలభ్యం వస్తుంది, కానీ అధిక సౌలభ్యం దేవాలయాన్ని తేలికగా తీసుకోవడాన్ని సులభం చేస్తుంది. మనం అలా చేసినప్పుడు, మనం “గురిని కోల్పోతాము,” ఆయన పరిశుద్ధ మందిరంలో రక్షకునికి దగ్గరయ్యే అవకాశాన్ని తక్కువగా అంచనా వేస్తాము. దూరంగా ఉన్నప్పుడు హాజరవ్వాలనే మన నిబద్ధత ఎంత బలంగా ఉందో దేవాలయం దగ్గరలో ఉన్నప్పుడు కూడా అలాగే ఉండాలి.
కార్టర్ మరియు కార్నార్వోన్ టుటన్ఖామున్ సమాధి కోసం వెదుకుతున్న కింగ్స్ లోయలో మరోచోట తవ్విన తర్వాత, వారు తమ పొరపాటును గ్రహించారు. వారు కొంతకాలం పాటు శ్రమించినట్లుగా, మన నిధిని కనుగొనడానికి మనం విఫలయత్నం చేయాల్సిన అవసరం లేదు. లేదా మూలం యొక్క క్రొత్తదనానికి విలువిస్తూ మరియు అలాంటి సలహాలు దేవుని యొక్క వినయపూర్వకమైన ప్రవక్త నుండి మనం పొందగలిగే దానికంటే ఎక్కువ జ్ఞానోదయం కలిగిస్తాయని ఆలోచిస్తూ, మనం అసాధారణ మూలాల నుండి సలహాలు కోరవలసిన అవసరం లేదు.
పాత నిబంధనలో నమోదు చేయబడినట్లుగా, నయమాను తన కుష్టు వ్యాధికి నివారణను కోరినప్పుడు, దగ్గరలోనున్న ఒక సాధారణ నదిలో తననుతాను ఏడుసార్లు ముంచుకోమని కోరినందుకు అతను కోపంగా ఉన్నాడు. కానీ అద్భుతం ఎలా జరగాలనే దాని గురించి తన స్వంత ముందస్తు ఆలోచనలపై ఆధారపడకుండా, ప్రవక్త ఎలీషా సలహాను అనుసరించడానికి అతను ఒప్పించబడ్డాడు. ఫలితంగా, నయమాను స్వస్థపరచబడ్డాడు.17 నేడు భూమిపై ఉన్న దేవుని ప్రవక్తను మనం నమ్మి, ఆయన సలహాపై పనిచేసినప్పుడు, మనం సంతోషాన్ని కనుగొంటాం మరియు మనం కూడా స్వస్థపరచబడగలం. మనం ఇకపై ఎటువైపుకు చూడవలసిన అవసరం లేదు.
సహోదర సహోదరీలారా, యేసు క్రీస్తును జ్ఞాపకముంచుకొని, ఎల్లప్పుడూ ఆయనపై దృష్టి కేంద్రీకరించమని నేను మిమ్మల్ని ప్రోత్సహిస్తున్నాను. ఆయన మన రక్షకుడు మరియు విమోచకుడు, మనం చూడవలసిన “గురి”, మన అతిగొప్ప నిధి. మీరు ఆయన వద్దకు వచ్చినప్పుడు, జీవితపు సవాళ్ళను ఎదుర్కొనే శక్తి, సరైనది చేసే ధైర్యం మరియు మర్త్యత్వంలో మీ నియమితకార్యాన్ని నెరవేర్చగల సామర్థ్యం మీకు బహుమానంగా ఇవ్వబడుతుంది. పశ్చాత్తాపపడడానికి అవకాశాన్ని, సంస్కారంలో పాలుపొందే విశేషాధికారాన్ని, దేవాలయ నిబంధనలు చేసి, పాటించే దీవెనను దేవాలయములో పూజలు చేయడం వల్ల కలిగే ఆనందం, మరియు జీవించియున్న ప్రవక్తను కలిగియున్నందుకు ఆనందాన్ని విలువైనవిగా చేసుకోండి.
నిత్య తండ్రియైన దేవుడు మన పరలోక తండ్రియని మరియు ఆయన సజీవుడని; యేసే క్రీస్తని; ఆయన దయగల, తెలివైన మన పరలోక స్నేహితుడని18 మరియు ఇది పునఃస్థాపించబడిన ఆయన సంఘమని నేను గంభీరమైన మరియు నిశ్చయమైన నా సాక్ష్యాన్నిస్తున్నాను. మీ విశ్వాసానికి, విశ్వసనీయతకు మీకు ధన్యవాదాలు. మీరు దీవించబడాలని, వృద్ధిచెందాలని, కాపాడబడాలని యేసు క్రీస్తు నామములో నేను ప్రార్థిస్తున్నాను, ఆమేన్.